జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు చర్చలు
- తానే స్వయంగా మాట్లాడుతానని చెబుతున్నారంటే జాతీయ పార్టీల అధినేతలతో టచ్ లోకి వెళ్ళటమే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.
మొత్తానికి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. కేంద్రంపై టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పార్లమెంటరీ పార్టీ నేతలతో తానే స్వయంగా మాట్లాడటానికి రెడీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎంపితో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. తాను మాట్లాడటమే కాకుండా తమ ఎంపిలను కూడా నేతలందరినీ వ్యక్తగతంగా కలిసి మద్దతు కోరాలని సూచించారు.
అవిశ్వాస తీర్మానం వరకూ ఓకే. నిజానికి జాతీయ పార్టీల మద్దతు కోసమైతే పార్లమెంటరీ పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తానే స్వయంగా మాట్లాడుతానని చెబుతున్నారంటే జాతీయ పార్టీల అధినేతలతో టచ్ లోకి వెళ్ళటమే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.
ఎలాగూ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతారు కాబట్టి పనిలో పనిగా కేంద్రప్రభుత్వ వైఖరిపైనా మాట్లాడుతారు. ఏపికి నరేంద్రమోడి సర్కార్ చేసిన అన్యాయంపై వివరిస్తారు. అంతిమంగా మోడికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరే అవకాశాలున్నాయి. అంటే, మూడో ఫ్రంట్ కావచ్చు లేదా పేరేదైనా కావచ్చు మోడి వ్యతిరేక శక్తులను ఏకంచేయటంలో చంద్రబాబు చొరవ చూపించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
ఒకవైపు కెసిఆర్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిపి మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరి భేటీ అయిన మరుసటి రోజే పార్లమెంటరీ పార్టీ నేతలతో తాను మాట్లాడుతానని చెప్పటంపై ఊహాగానాలు మొదలయ్యాయి.