అనేక సంవత్సరాలుగా బాబు  దావోస్ సదస్సులకు హాజరవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో, ఆ తరువాత ప్రతిపక్ష నేతగా కొనసాగిన సందర్భాలలో కూడా చంద్రబాబునాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులలో పాల్గొన్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 47 వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వరుసగా మూడో ఏడాది ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 20 వ తేదీ వరకు దావోస్‌లో ఈ సదస్సు జరగనున్నది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


‘స్పందించే బాధ్యతాయుత నాయకత్వం’ (Responsive and Responsible Leadership)-అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ దఫా సమావేశాలలో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని సదస్సును ఫలవంతం చేయాలని కోరుతూ ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజ్‌మెంట్ బోర్డు మెంబర్ ఫిలిప్ రోజియర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారని ముఖ్యమంత్రి కార్యాలయంం తెలిపింది.

 ప్రస్తుతం జెనీవా పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను స్వయంగా కలిసి డబ్లుఈఎఫ్ ఉన్నతాధికారులు ఈ లేఖను అందించారు. 


ప్రపంచ ఆర్థిక సదస్సులలో పొల్గొనడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇదేం కొత్త కాదు. అనేక సంవత్సరాలుగా వరుసగా ఆయన దావోస్ సదస్సులకు హాజరవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో, ఆ తరువాత ప్రతిపక్ష నేతగా కొనసాగిన సందర్భాలలో కూడా చంద్రబాబునాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులలో పాల్గొన్నారు. డబ్లుఈఎఫ్ సదస్సుకు ఆయన మోడరేటర్‌గా వ్యవహరించిన సందర్భాలూ వున్నాయి. ఈ వేదికల మీద నుంచే మన ముఖ్యమంత్రి అనేకమంది విదేశీ ప్రతినిధుల్ని ఆకర్షించి ప్రపంచం దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించగలిగారు.


గత ఏడాది, ఈ ఏడాది జనవరి మాసంలో జరిగిన సదస్సులకు ముఖ్యమంత్రి ఏపీ నుంచి అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్లారు. 2015లో జరిగిన సదస్సుకు డబ్లుఈఎఫ్ అధ్యక్షుడు క్లాజ్ ష్వాబ్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ‘పట్టణాభివృద్ధి భవితవ్యం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని నవ్యాంధ్రప్రదేశ్ లక్ష్యాలు, తన విజన్ గురించి వివిధ దేశాల అధినేతలు, పలు సంస్థల సీఈవోలకు వివరించారు. మన కొత్త రాజధాని అమరావతిని ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేశారు. ఈ సదస్సులోనే ముఖ్యమంత్రి-‘విజన్ ఫర్ టుమారో, లెర్నింగ్ ఫర్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్’ అనే అంశాలపై ఏర్పాటుచేసిన సెషన్లలో మాట్లాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఫోరం అధ్యక్షుడు క్లాజ్ ష్వాబ్ ప్రత్యేకంగా రిసెప్షన్ ఇచ్చారు. 


రెండోసారి ఈ ఏడాది ఆరంభంలో జరిగిన డబ్లుఈఎఫ్ 46వ సదస్సుకు మరోసారి ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి- ‘బ్రాండ్ ఏపీ’గా రాష్ట్ర ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేశారు. ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’కు పెట్టుబడులను ఆకర్షించడానికి అంతర్జాతీయ ఆర్థిక వేదిక నుంచి ప్రయత్నం చేసి విజయం సాధించారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవం’ (ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవెల్యూషన్) అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించగలిగారు.