నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్
‘తనపైన అలిగి దూరంగా ఉన్నవారందరినీ పిలిపించి మాట్లాడటం తప్ప తనకు ఇంకేమీ పనిలేదా’ అంటు ఖస్సుమన్నారట. ‘ఉండేవాళ్లు ఉంటారు పోయే వాళ్ళు పోతార’న్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తనపై అలిగిన, అసంతృప్తితో ఉన్న నేతలకు చంద్రబాబునాయుడు గట్టి హెచ్చరికలే చేసారు. ‘తనపైన గానీ పార్టీపైన గానీ అలిగిన వారిని, అసంతృప్తితో ఉన్న వారిని పిలిపించుకుని బ్రతిమాలు కోవాల్సిన అవసరం తనకు లేద’ని స్పష్టం చేసారు. చిత్తూరు జిల్లా నేతల సమీక్ష సందర్భంగా మంత్రి అమరనాధరెడ్డి ఎంపి శివప్రసాద్ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఎంపి చంద్రబాబుపై బాహాటంగానే ఆరోపణలు చేసారు కదా? దాంతో అప్పటి నుండి సిఎం, ఎంపిల మధ్య బాగా గ్యాప్ వచ్చింది.
అదే విషయమై అమర్ మాట్లాడుతూ ‘ఎంపిని పిలిపించి ఒకసారి మాట్లాడితే బాగుంటుంద’ని చేసిన సూచనపై సిఎం మండిపడ్డారు. ‘తనపైన అలిగి దూరంగా ఉన్నవారందరినీ పిలిపించి మాట్లాడటం తప్ప తనకు ఇంకేమీ పనిలేదా’ అంటు ఖస్సుమన్నారట. ‘ఉండేవాళ్లు ఉంటారు పోయే వాళ్ళు పోతార’న్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరెవరికి తనపై అసంతృప్తి ఉందో తెలుసుకుంటూ వాళ్ళందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టంగా చెప్పటం పలువురిని ఆశ్చర్యపరిచింది.
చంద్రబాబు మాటలను బట్టి తనపై అలిగిన వాళ్ళు వాళ్ళతంట వాళ్ళుగా తన వద్దకు వస్తే మాట్లాడుతానన్నట్లుగా ఉంది. దీనిబట్టి చూస్తే బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శివాజి, బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు చంద్రబాబు గట్టి హెచ్చరికలే చేసినట్లు అనిపించటం లేదూ.