అదే రోజు సాయంత్రం ఉద్యమంలో పై ఎత్తున తిరిగిన వారిలో కొద్ది మంది టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వర్ ను కలిసారు. వారంతా బోండా ఉమను ఓ హోటల్లో కలిసి మంతనాలు జరిపారు.
నాడి బాగా పట్టుకున్నారు కాబట్టే చంద్రబాబు విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. కాపుల్లో ముద్రగడకు మద్దుతు ఇచ్చే వారు ఎంత మందో స్పష్టత లేదు కానీ వ్యతిరేకించే వారికి మాత్రం కొదవ లేదని చంద్రబాబుకు అర్ధమైంది. అందుకనే కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుక ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే అవకాశం ఉన్న వారిని లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయం మొన్నటి ‘కంచాలు కొట్టే’ కార్యక్రమంలో రుజువైంది కూడా. ఇంతకీ విషయ మేమిటంటే కొందరు కాపు నేతలు డబుల్ గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపు ముద్రగడతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు అధికార పార్టీలోని కొందరు కాపు నేతలతో రహస్య మంతనాల్లో మునిగితేలుతున్నారు.
కాపులను బిసిల్లో చేర్చాలన్న ఉద్యమంలో భాగంగా మొన్న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కంచాలు కొట్టే కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగినట్లే విజయవాడలోని ఓ సినిమా థియేటర్ వద్ద పలువురు కాపు నేతలుగా చెలామణి అవుతున్న వారు జమఅయ్యారు.
ఉన్న కొద్ది మంది కాసేపు కంచాలను కొట్టి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే అదే రోజు సాయంత్రం ఉద్యమంలో పై ఎత్తున తిరిగిన వారిలో కొద్ది మంది టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వర్ ను కలిసారు. వారంతా బోండా ఉమను ఓ హోటల్లో కలిసి మంతనాలు జరిపారు. తమకు సిఎం చంద్రబాబునాయడు అపాయింట్ మెంట్ కావాలని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
అదే సమయంలో కాపు ఉద్యమంతో పాటు ముద్రగడ వ్యవహారశైలి పైన కూడా వారంతా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు తెలిసింది. నిజంగానే ముద్రగడ మద్దతుదారులుగా ఉన్న వారు ఉద్యమం పట్ల చిత్తశుద్దితో ఉంటే బోండా ఉమను కలవాల్సిన అవసరం ఏమిటనేది కొందరు కాపు నేతలు ఆశ్చర్యపోతున్నారు.
చంద్రబాబునాయడేమో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ముద్రగడతో పాటు ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారు. అదే సమయంలో టిడిపిలోని బోండా, నిమ్మకాయల చిన్నరాజప్ప లాంటి కొందరు కాపు నేతల ద్వారా ముద్రగడ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయిస్తున్నారు.
ఇటువంటి సమయంలోనే ఓవైపు ఉద్యమంలో పాల్గొంటూ మరోవైపు అధికార పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారంటే సదరు కాపు నేతల డబుల్ గేమ్ అర్ధం అవుతోంది.
