జగన్ కు ముద్రగడ సవాల్: పవన్ కల్యాణ్ వైపు...?
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జగన్ కు సవాల్ విసిరారు.
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జగన్ కు సవాల్ విసిరారు. ఇతర కులస్థులకు సిఎం పదవి ఇస్తావా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు.
ఆదివారం గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్కు రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని ఆయన అన్నారు.
తామే రూ.20 వేల కోట్లు ఇస్తామని, ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అని ఆయన జగన్ ను అడిగారు. తమ డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ఆయన అన్నారు.
ముద్రడ వైఖరిని చూస్తుంటే ఆయన పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్లపై పవన్ కల్యాణ్ స్పష్టమైన వైఖరి ప్రకటించని విషయం తెలిసిందే. అయితే, కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. ఈ స్థితిలో ముద్రగడ పవన్ కల్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో సమర్థించే అవకాశాలున్నాయని అంటున్నారు.