జనసేన-టీడీపీ కూటమిలోకి ముద్రగడ ? పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారా?
ముద్రగడతో జనసేన నేతలు చర్చించారు. జనసేన నేతలు కిర్లంపూడిలో ఉన్న మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి బొల్లి శెట్టి శ్రీనివాస్ తో సహా మరి కొంతమంది నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు.
కాకినాడ : ముద్రగడ పద్మనాభం.. ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రముఖంగా వినిపిస్తున్నపేరు. కాపు ఉద్యమ నేతగా, రాజకీయ నాయకుడిగా ఆయన సుపరిచితమే. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నఆయన ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు విపరీతంగా పెరిగాయి. నూతన సంవత్సరం వేళ జనవరి ఒకటవ తేదీన ఆత్మీయ సమ్మేళనంలో కూడా.. ముద్రగడ, ఆయన కుమారులు ఇలాంటి హింట్స్ ఇచ్చారు. కానీ, ఆయన ఆశించిన స్థానాల్లో ఇన్చార్జిలను వైసిపి వేరే వారిని ప్రకటించింది. ఆయనను పిలిపించి మాట్లాడుతుందని భావించిన క్రమంలో.. వైసిపి ముద్రగడతో ఎలాంటి చర్చలూ జరపలేదు.
వైసీపీలో చేరితే పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేటల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని… కాకినాడ ఎంపీ సీటును కోరుకున్నారు. అయితే.. వైసిపి గతవారం విడుదల చేసిన కొత్త ఇన్చార్జిల జాబితాలో ఈ స్థానాల్లో వేరే వారిని ఇన్చార్జీలుగా ప్రకటించింది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరే ఆశలు ఆవిరైపోయాయి. ఈ క్రమంలోనే మరో వార్త వెలుగు చూస్తోంది. ముద్రగడతో జనసేన నేతలు చర్చించారు. జనసేన నేతలు కిర్లంపూడిలో ఉన్న మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి బొల్లి శెట్టి శ్రీనివాస్ తో సహా మరి కొంతమంది నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణలో ఓటేసి ఏపీలో వేస్తామంటే కుదరదు.. వారిపై క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ, ఏకాంత చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు. ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట. దీనికి కూడా ముద్రగడ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాపు జాతి అంతా కలిసి పని చేయాలని జనసేన నేతలతో ముద్రగడ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. మరో పరిణామం కనిపిస్తోంది.. టిడిపి నేత జ్యోతుల నెహ్రూ గురువారం నాడు ముద్రగడను కలిసి టీడీపీ-జనసేన కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.
ఇక మరోవైపు రెండు, మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడను స్వయంగా కలవనున్నారని చర్చ జరుగుతోంది. గతంలో.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈసారి జనసేన - టిడిపి కూటమి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ముద్రగడను కలుపుకుపోవాలని చూస్తుండడం, మరోవైపు వైసీపీకి మరో కాపు నేత అంబటి రాయుడు కూడా దూరం అవ్వడం.. ఇప్పుడు ముద్రగడ జనసేన టిడిపి కూటమిలో చేరతారని వినిపిస్తుండడంతో.. ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.
అయితే ఈమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ స్పష్టంగా ఓడిపోతుందని తెలుస్తోందని.. కానీ కొందరు కాపు నేతలు మాత్రం ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో ఆరోపించారు. అంతేకాదు, వారు పెద్దలు.. తాను వారిని గౌరవిస్తానని.. తనను ఎంతగా దూషించినా వాటిని దీవెనలుగానే స్వీకరిస్తానని.. అలాంటి పెద్దలకు తన వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా క్రియాశీలకంగా, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని పేర్కొంటూ.. కాపులను రాజకీయంగా వాడుకుంటున్న వారిని ముందుగా ప్రశ్నించాలని అన్నారు. ముద్రగడతో జనసేన నేతల సంభాషణలో ఈ అంశాలు చర్చకు వచ్చాయట. మరి చూడాలి ముద్రగడ ఎటువైపు తిరుగుతారో.