టీడీపీని ఎవరు వీడుతారో తెలుస్తది..చంద్రబాబుకి విజయసాయి కౌంటర్
రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో ఎంపీ రామ్మెహన్ నాయుడికి కౌంటర్ ఇచ్చారు. ‘‘ తక్కువ మాట్లాడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది. అజ్ఞానం బయట పడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్ పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకి సమఉజ్జీనే. డౌటే లేదు. ఆ పార్టీకి కావాల్సింది ఇలాంటి వారే.’’ అంటూ రామ్మోహన్ నాయుడిపై కౌంటర్ వేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపింది. ఈఎస్ఐ కుంభ కోణం పేరిట అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. కాగా.. ఆయన అరెస్టుని చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.