‘జగన్ నాకు రూ.30కోట్లు ఆఫర్ చేశాడు’.. జేసీ
నేను ఎవరినీ పొగడనంటున్న జేసీ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తనను వైసీపీలో చేరాలంటూ రూ.30కోట్లు ఆఫర్ చేశాడని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. విజయసాయి రెడ్డి ద్వారా తనకు రాయబారం పంపించినట్లు వివరించారు. అందుకు తాను అంగీకరించలేదని.. జగన్ ..నాన్న, తాత కంటే కూడా తానే పెద్ద రెడ్డినే అని చెప్పానట్లు తెలిపారు.
అనంతపురం యల్లనూరు గొడ్డుమర్రి ఊట కాలువ తూముకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యామినీబాలతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుపడాలని తపన పడే వ్యక్తి చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును వ్యతిరేకించానని, ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన తరువాత జగన్ కంటే చంద్రబాబే మేలనిపించి టీడీపీలోకి వెళ్లానన్నారు.
ఈనాడు గాంధీని మనం చూడలేకపోయినా, ప్రతి ఒక్కరికీ గాంధీ అంటే తెలుసునన్నారు. చంద్రబాబు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, మంచి పనులు చేస్తే చనిపోయిన తరువాత కూడా పది కాలాలు గుర్తుంచుకుంటారనే తపన కలిగి మంచి పనులు చేస్తున్నారన్నారు. తాను ఎవరినీ పొగడనని, అలా పొగిడి పదవులు పొందాలనే ఆశ కూడా తనకు లేదని ఆయన పేర్కొన్నారు.