బ్రాహ్మణ అమ్మాయితో పెళ్లి చేస్తే రాహుల్ ప్రధాని అవుతాడన్న జేసీ
*రాహుల్ పెళ్లిపై జేసీ కామెంట్
*సోనియాకి కూడా ఈ విషయం చెప్పానన్న జేసీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ రామ్మోహన్ రాయుడు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దీక్షకి మద్దతు తెలుపుతూ ఇతర టీడీపీ ఎంపీలంతా హాజరయ్యారు.
కాగా.. అలా హాజరైన వారిలో జేసీ దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే రాహుల్ పెళ్లి గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
‘రాహుల్ ప్రధాని కావాలంటే ఉత్తరప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం అయిన బ్రాహ్మణుల మద్దతు కావాలని నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి చెప్పాను. యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది డిసైడ్ చేయడంలో బ్రాహ్మణ సామాజిక వర్గమే కీలకం. అందుకే బ్రాహ్మణ అమ్మాయిల్లో మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి రాహుల్కి ఇచ్చి పెళ్లి చేయమని సోనియా గాంధీకి సలహా ఇచ్చా. కానీ, అప్పుడు ఆమె నా మాట వినలేదు.’’ అంటూ అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని జేసీ దివాకర్రెడ్డి బయటపెట్టారు.