శ్రీసీటీలో ప్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీ యూనిట్

అమరావతి: ప్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలోని తిరుపతిలో తమ యూనిట్‌ను ఈ కంపెనీ ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రూ. 585 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. 

ప్లెక్స్ ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటు వల్ల సుమారు 6600 ఉద్యోగాలు రానున్నాయి. ప్లెక్స్ ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులు మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో అమరావతిలో సమావేశమయ్యారు.

ఈ సమావేశం తర్వాత ప్లెక్స్ ట్రానిక్స్ కంపెనీతో సమావేశ వివరాలను ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీడియాకు వివరించారు. మొబైల్స్ తయారీలో ఏపీ రాష్ట్రం దేశంలోనే ముందుండాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

మూడున్నర ఏళ్ళలో దేశంలోనే మొబైల్స్ ఉత్పత్తిలో ఏపీ రాష్ట్రం దేశంలోనే 20 శాతానికి చేరుకొందని చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడ ఉత్పత్తి కాలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రిలయన్స్ కూడ ఏపీ రాష్ట్రంలో ప్రారంభించే మొబైల్ ఫోన్ల యూనిట్‌లో దేశంలోనే అత్యధికంగా ఏపీలో ప్రారంభించే యూనిట్‌లోనే 80 శాతం మొబైల్స్ ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని లోకేష్ చెప్పారు.ప్లెక్స్ ట్రానిక్స్ సంస్థ శ్రీసీటీలో తమ యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు.