రుతుపవనాలు ఆలస్యం.. మరో రెండు, మూడు రోజుల తరువాతే కేరళకు..
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో కేరళకు చేరుకుంటాయని భావిస్తున్నారు. అంతకుముందు, భారత వాతావరణ శాఖ పక్షం రోజుల క్రితం బంగాళాఖాతంలో సంభవించిన అసని తుఫాను వల్ల శుక్రవారంనాటికే కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని అంచనా వేసింది.
విశాఖపట్నం : భారత వాతావరణ శాఖ ముందుగా ప్రకటించినట్టుగా శుక్రవారం కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. దీంతో మరికొద్ది రోజుల పాటు వేడి వాతావరణం కొనసాగేలా ఉంది.
కేరళలో రుతుపవనాలు ఈనెల 27న ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ 12 రోజుల క్రితం ఒకసారి, రెండు రోజుల క్రితం మరోసారి వెల్లడించింది. అయితే ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాయువ్య దిశగా వీస్తున్న గాలులు పడమర దిశలోకి పూర్తిగా మారలేదు.
దీంతో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి మరో రెండు, మూడు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
దక్షిణ అరేబియా సముద్రంలో పడమర గాలులు తక్కువ ఎత్తులో విస్తరించాయని, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించాయని.. ఈ నేపథ్యంలో ఈనెల 29 లేదా 30వ తేదీన కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది.