ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీడీపీ, వైసీపీ పోటా పోటీ మైండ్గేమ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకెొని టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా మైండ్ గేమ్ ఆడుతున్నాయి. రెండు పార్టీలు పోటీలు పడి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాయి.
ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఏడు స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను బరిలోకి దింపింది. టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ ఈ ఎన్నికల్లో అభ్యర్ధిని బరిలోకి దింపకపోతే వైసీపీకి చెందిన ఏడుగురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండేది. ఎమ్మెల్సీగా విజయం సాధించాలంటే కనీసం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం.
టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేలు వైసీపీకి జై కొట్టారు. దీంతో టీడీపీ బలం 19కి పడిపోయింది. జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో వైసీపీ బలం 156కి చేరింది.
అయితే వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు టీడీపీ కి ఓటు వేసే అవకాశం ఉంది. ఓటింగ్ కు వెళ్లే ముందు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీతో టచ్ లోకి వెళ్లనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరో వైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మప్రభోధానుసారం మేరకు ఓటు వేసినట్టుగా ఆయన చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి రేపు టీడీపీలో చేరనున్నారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీకే ఓటు వేసే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
టీడీపీకి చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ామోదించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి లో రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన అనురాధకు గంటా శ్రీనివాసరావు ప్రతిపాదకుడిగా సంతకం చేశారు. ఓటరు లిస్టులో గంటా శ్రీనివాసరావు పేరు కూడ ఉంది. ఈ సమయంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని గంటా శ్రీనివాసరావు కొట్టి పారేశారు. వైసీపీ మైండ్ గేమ్ గా ఆయన పేర్కొన్నారు.
also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫస్టు ఓటేసిన వైఎస్ జగన్
మరో వైపు వైసీపీలోని 16 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. అసంతృప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకత్వం చర్చలు జరిపిందని సమాచారం.