ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ మైనర్ బాలిక ఓ ఆటోడ్రైవర్ మాయలోపడి గర్భం దాల్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయం బయటపడితే పరువుపోతుందిని బాలిక ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తల్లిదండ్రులు అబార్షన్ కు సిద్దపడ్డారు.
ఒంగోలు: ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో ఆటోడ్రైవర్. దీంతో బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడితే పరువుపోతుందని గుట్టుగా అబార్షన్ చేయించడానికి బాలిక తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ వైద్యసిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమివ్వగా ఆటోడ్రైవర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తర్లుపాడు మండలంలోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన ఆంజనేయులు(24) ఆటో డ్రైవర్. ఇతడు ఇంటర్మీడియట్ చదివే ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఇలా బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.
అయితే బాలిక తల్లిదండ్రులకు అనుమానం రావడంతో కూతురికి వైద్యపరీక్షలు చేయించారు. దీంతో ఆమె ఆరోనెల గర్భంతో వున్నట్లు తేలింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు కూతురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అబార్షన్ కు సిద్దపడ్డారు. ఇందుకోసం ఒంగోలులోని ఓ హాస్పిటల్ కు వెళ్లారు.
హస్పిటల్ సిబ్బందికి అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు హాస్పిటల్ కు వద్దకు వెళ్ళి విచారించగా బాలిక పెళ్ళికాకుండానే ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయి గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
బాలిక తల్లిదండ్రులకు పోలీసులు ధైర్యం చెప్పడంతో తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే కర్నూల్ జిల్లాలో ఇలాగే ఓ వ్యవసాయ కూలీ పొలం యజమాని చేతిలో మోసపోయిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. తన పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేసే యువతితో యువకుడు ఏడాదిగా ప్రేమాయణం సాగించాడు.పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా... అంటూ యువతి బంధువులు ఎదుటే ప్రియుడికి బడిత పూజ చేసింది.
కల్లూరు మండలం చిన్నటేకూరుకి చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా.. కుటుంబ సభ్యులు వద్దంటున్నారు అని శేఖర్ బదులిచ్చాడు. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరింది. కానీ శేఖర్ ససేమిరా అన్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుని తెలంగాణలోని బంధువులు ఊరికి తీసుకువెళ్ళింది. ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించడంతో అక్కడే ఉన్న కర్రతో చితకబాదింది. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో... వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... సదరు యువతి ప్రేమ విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయట పడింది.