సీఎం జగన్ పేరు నిలబెట్టేలా పనిచేయండి..: వాలంటీర్లతో మంత్రి వెల్లంపల్లి
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రికమెండేషన్లు వద్దని... అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అమరావతి: ప్రభుత్వ పధకాలు ప్రజలకు నేరుగా అందాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ విధానం తీసుకువచ్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మ భూమి కమిటీలు పార్టీ వ్యక్తులకే కొమ్ము కాసి, అర్హులకు అందాల్సిన పధకాలకు తూట్లు పొడిచారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రికమెండేషన్లు వద్దని... అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని చెప్పారన్నారు. కుల, మత, పార్టీ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరాలని సూచించారని తెలిపారు. కాబట్టి సీఎం జగన్ పేరు నిలబెట్టేలా పనిచేయాలి వాలంటీర్లకు వెల్లంపల్లి సూచించారు.
''ఇంతకుముందు ఒక వ్యక్తి చనిపోతే గానీ మరొకరికి పింఛన్ వచ్చేది కాదు. జగన్ సీఎం అయ్యాక ఆ విధానానికి స్వస్తి పలికారు. ఇలా సీఎం వాలంటీర్ల చేత మంచిమంచి పనులు చేయిస్తున్నారు. కానీ బాద్యతాయుత ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు వాలంటీర్లను అవమానిస్తున్నాడు'' అని మండిపడ్డారు.
''కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేశారు వాలంటీర్లు. రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకునెలా వీరి పని తీరు ఉంది. సీఎం జగన్ సైతం వాలంటీర్ వ్యవస్థ గురించి ఓ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తెలియజేశారు. అనేక రాష్ట్రాలు ఈ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పధకాలకు వారదులుగా వాలంటీర్లు నిలిచారు'' అని వెల్లంపల్లి పేర్కొన్నారు.
video వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... సీఎం జగన్ చేతులమీదుగా...
''అర్హులైన వారికి పధకాలు చిత్తశుద్దితో చేరువ చేయండి. వాలంటీర్లు అంటే గుమస్తా కాదు... ప్రజా సేవకులు. వాలంటీర్లది స్వచ్ఛంద సేవా వ్యవస్థ. ప్రజలకు మరింత సేవ చేయాలని మిమ్మల్ని పురస్కారాలతో జగన్మోహన్ రెడ్డి సత్కరిస్తున్నారు. చిట్ట చివరికి వ్యక్తి కూడా లబ్ధి చేకూరే చూడండి'' అని వాలంటీర్లకు సూచించారు మంత్రి వెల్లంపల్లి.
''ఫించన్ తీసుకునే విడోస్ లలో 8లక్షల మందికి చేయూత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.18 వేలు చేసిన పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి ది'' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు.