సొంతూరికి, సొంతజిల్లాకు ఏం చేశారని.. అందుకే ఓడగొట్టారు : చిరు, నాగబాబు, పవన్లపై రోజా సంచలన వ్యాఖ్యలు
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. సొంతూరికి, సొంత జిల్లాకు వారు ఏమి చేయలేకపోయారని అందుకే జనం ఓడించారంటూ చురకలంటించారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకోవడం మొదటి నుంచి అలవాటేనంటూ ఆమె ధ్వజమెత్తారు.
మెగా బ్రదర్స్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సొంతూరికి, సొంత జిల్లాకు వారు ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే ఈ ముగ్గురిని సొంత జిల్లా ప్రజలు ఓడించారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి వీరు ముగ్గురికి రాజకీయ భవిష్యత్తు లేదనేది స్పష్టమవుతోందన్నారు. పవన్ కల్యాణ్కు కనీస మానవత్వం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయినా పవన్ కనీసం స్పందించలేదని రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకోవడం మొదటి నుంచి అలవాటేనంటూ ధ్వజమెత్తారు.
సాధారణంగా సినీనటులు సెన్సిటివ్గా వుంటారని.. కానీ వీరు మాత్రం అందుకు భిన్నమని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తప్పులు చేసిన సమయంలో ఆయనకు మద్ధతుగా పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వుంటాని ఆమె దుయ్యబట్టారు. ఇప్పటంలో గోడలకు వున్న విలువ గుంటూరు, కందుకూరులలో చనిపోయిన వారికి పవన్ ఇవ్వడం లేదని రోజా మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 విడుదల చేయగానే పవన్ బెంబేలెత్తిపోతున్నాడని ఆమె విమర్శలు చేశారు.