Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లికి చేరిన నగరి పంచాయతీ... వ్యతిరేక వర్గంపై జగన్‌కు రోజా ఫిర్యాదు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగరి వైసీపీలో తన వ్యతిరేక వర్గంగా వున్న వారిపై ఆమె ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 

minister rk roja meets ap cm ys jagan
Author
First Published Oct 26, 2022, 8:39 PM IST

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి రోజాకి, అక్కడి స్థానిక వైసీపీ నేతలకు మధ్య పడటం లేదు. రోజా రెండవసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నగరి వైసీపీలో గ్రూపులు ఎక్కువయ్యాయి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆమె పలుమార్లు వ్యాఖ్యానించారు. మంత్రి, ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిరోజూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ ఇక్కడ తిరిగి బలం పుంజుకునే అవకాశాలు వున్నాయంటూ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన రోజా.... నగరి పరిణామాలపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. చక్రపారెడ్డి, ఇతర అసమ్మతి గ్రూపుల వైఖరిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి అంతర్గత కుమ్ములాటలతో తలబొప్పి కడుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. నిత్యం ఎవరో ఒకరు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. దీంతో ఈ విషయాలు సీఎం జగన్ వరకు వెళ్లడంతో రాజీ కుదిర్చే బాధ్యతలను పార్టీ పెద్దలకు అప్పగిస్తున్నారు. మొన్నామధ్య సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, అబ్ధుల్ ఘనీ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా అక్కడ అసమ్మతి వర్గాలు ఒక్కటవుతున్నాయి. మొన్నామధ్య ప్రెస్ క్లబ్ వేదికగా నేతల మధ్య రాళ్ల దాడి సైతం జరిగింది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. వీరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్. దీంతో మూడు వర్గాలను మంత్రి అమరావతికి పిలిపించి మాట్లాడారు. 

ALso REad:జగన్ వద్దకు గన్నవరం, బందర్ పంచాయతీలు... లైన్ దాటితే చర్యలు తప్పవు: నేతలకు సీఎం హెచ్చరిక

అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి , మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య చెలరేగిన వివాదంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే ఇలా మీడియాకెక్కి రచ్చకెక్కడం సరికాదని, మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎంపీని అడ్డగించడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios