పవన్ కల్యాణ్ ఇప్పటం , విశాఖపట్నం రావటం వల్ల తమకు మంచే జరిగిందన్నారు మంత్రి రోజా. తండ్రి సీఎంగా వున్నప్పుడే గెలవలేని లోకేశ్.. జగన్‌కు సవాల్ విసరడం విడ్డూరంగా వుందన్నారు.  

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా. గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటంలో పవన్ రౌడీలా ఊగిపోయారంటూ దుయ్యబట్టారు. కార్లపై కూర్చొని పవన్ హంగామా చేస్తే.. ఇప్పటం ఘటనపై ఈనాడు తప్పుడు వార్తలు రాసిందని రోజా మండిపడ్డారు. చివరికి 14 మంది పిటిషనర్లకు కోర్ట్ జరిమానా విధించిందని ఆమె చురకలంటించారు. సీఎం జగన్ ఏది చేసినా ప్రజల కోసమేనని, మరోసారి రుజువైందని.. విశాఖలోని రుషికొండలోనూ అభివృద్ధి పనులే జరుగుతున్నాయని రోజా చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

న్యాయస్థానం డైరెక్షన్‌లోనే రుషికొండ విషయంలో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి.. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇప్పటం , విశాఖపట్నం రావటం వల్ల తమకు మంచే జరిగిందన్నారు రోజా. పోయిన ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ని జనం రెండు చోట్ల ఓడించారని, ఈసారి ఆయన పార్టీని కనిపించకుండా తరిమికొడతారని మంత్రి జోస్యం చెప్పారు. ఇక .. నారా లోకేష్‌పైనా రోజా ఫైర్ అయ్యారు. ఆయన ఏకంగా జగన్‌కు సవాల్ విసురుతున్నారని, తండ్రి సీఎంగా వున్నప్పుడే గెలవలేని లోకేశ్.. సవాల్ విసరడం విడ్డూరంగా వుందన్నారు.

Also REad:పవన్‌ని పావుగా వాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఇలాగే : చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

అంతకుముందు గురువారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని ఆమె ఎద్దేవా చేశారు. కర్నూలులో వీధి రౌడీలా చంద్రబాబు ప్రవర్తించారని రోజా దుయ్యబట్టారు. బాబు, పవన్‌లు జగన్‌పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. వారిద్దరివి దిగజారుడు రాజకీయాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఈ రోజు గుంటూరులో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా డప్పులు వాయించగా... రోజా ఆహుతుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కళాకారులతో కలిసి స్టెప్పులు వేసి దుమ్ము రేపారు. దీంతో సభకు వచ్చిన వారంతా రోజా డ్యాన్స్‌ను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు.