కలుద్దామని బాబుకు నేనే చెప్పా: కాంగ్రెస్ తో పొత్తుపై మంత్రి పితాని
రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విభిన్న ధృవాలు. 37 ఏళ్ల కాలంపాటు ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ ను గద్దె దించేందుకు అన్న ప్రచారం కూడా ఉంది.
విజయవాడ: రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విభిన్న ధృవాలు. 37 ఏళ్ల కాలంపాటు ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ ను గద్దె దించేందుకు అన్న ప్రచారం కూడా ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం చెందిన అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. తెలుగుప్రజల ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. టీడీపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇప్పటికీ సీఎం చంద్రబాబు చెప్పేది కూడా అదే కాంగ్రెస్ పార్టీతో 37 ఏళ్లు పోరాటం చేశామని. అది నగ్న సత్యం కూడా.
అలాంటి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి నేరుగా రాహుల్ గాంధీని కలవడం పొత్తు ప్రతిపాదన తీసుకురావడం ఇదంతా కొద్దిరోజుల వ్యవధిలోనే జరిగిపోయింది.
అయితే చంద్రబాబు రాహుల్ గాంధీని కలవడం, కలిసి పనిచేద్దామని పిలుపు ఇవ్వడం చూసి తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయి నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి అయితే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యిందంట.
కాంగ్రెస్ తో కలయికకు బీజం వేసింది తానేనని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు వంటి అంశాలపై కేంద్రప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. అయితే ఆ అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే అంశంపై టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. అయితే ఆ చర్చల్లో మంత్రి పితాని సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకుందామని ప్రతిపాదించారట. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు కాంగ్రెస్ పై ప్రేమ పుట్టుకు వచ్చిందో ఏమో తెలీదు కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుందామన్నారట.
అయితే ఎక్కువమంది నేతలు తన ప్రతిపాదనను వ్యతిరేకించారని తెలిపారు. అయితే హక్కుల సాధన కోసం కాంగ్రెస్ తో టీడీపీ కలిసిందని పితాని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. మెుత్తానికి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలయికపై ఆలోచన తన ప్రతిపాదనతోనే వచ్చిందని చెప్పుకుని సంబరపడిపోతున్నారు మంత్రి పితాని.