ఆంద్ర ప్రదేశ్ లో విద్యుత్ కోతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణల వలనే ఇప్పుడు రాష్ట్రం దివాళా తీస్తోందన్నారు.
అమరావతి: పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కం) ల్లో కమర్షియల్ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) అధికారులను ఆదేశించారు. డిస్కంల పరిధిలో విద్యుత్ నష్టాలు, దుబారాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ చౌర్యంను పూర్తిస్థాయిలో అరికట్టాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.
ఇవాళ సచివాలయంలో ఎపి పవర్ కోఆర్డినేషన్ కమిటీ (ఎపిపిసిసి), ఎపి సదరన్, సెంట్రల్, ఈస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సిఎండిలతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విద్యుత్ కోతలపై స్పందించారు. బొగ్గు సరఫరాలో కొరత కారణంగా ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని.. దీనివల్ల కొంతమేర విద్యుత్ సరఫరాలో ఆంతరాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇటువంటి సంక్షోభాలను పూర్తిగా ఎదుర్కోవడానికి విద్యుత్ రంగ అధికారులు సన్నద్దంగా ఉండాలని సూచించారు.సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అందించే ఉచిత విద్యుత్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారని...ఈ మేరకు రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
''సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో రైతన్నలకు అండగా నిలవాలనే లక్ష్యంతో వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి మొత్తం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ను సమీకరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది రైతులకు ప్రత్యేక వ్యవసాయ డిస్కమ్ ద్వారా నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలవుతుంది'' అని మంత్రి తెలిపారు.
''ప్రస్తుత డిస్కమ్ లపై ఆర్థికంగా ఎలాంటి అదనపు భారం లేకుండా రాబోయే 25 ఏళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను అందించాలనే ముందుచూపుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డిస్కంలకు చేయూత అందించడం, ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు ప్రభుత్వం గత 3 ఏళ్లలో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ, వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలి'' అని పెద్దిరెడ్డి సూచించారు.
''నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ రంగం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటోంది. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో డిస్కం లపై ఒత్తిడి తెచ్చి, వచ్చే 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు చేయించారు. ఇలాంటి ఒప్పందాల ఫలితంగా 2014- 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసింది. నష్టాలు రూ 7,000 కోట్ల నుండి రూ 27,200 కోట్లకు చేరుకున్నాయి. అప్పులు రూ.31,000 కోట్ల నుంచి రూ 62,000 కోట్లకు చేరుకున్నాయి. విద్యుత్ శాఖ వార్షిక ఆదాయ అవసరాలు, వ్యయం అనూహ్యంగా రూ 25,000 కోట్ల నుంచి రూ 48,000 కోట్లకు పెరిగింది'' అని మంత్రి వెల్లడించారు.
''2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏడాదికి సబ్సిడీగా సుమారు 4,000 కోట్లు చెల్లిస్తే... సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత 2019 నుండి ప్రతి సంవత్సరం 9,000 కోట్లు పైగా సబ్సిడీ భారంను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ బకాయిలకు గాను 2014-19 మధ్య కాలంలో కేవలం 24,165 కోట్లు మాత్రమే చెల్లించగా... మా ప్రభుత్వం 2019 నుండి 2021-22 వరకు 35,963 కోట్లు చెల్లించింది'' అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
''తెలుగు దేశం హయాంలో మార్కెట్ లో సౌర విద్యుత్ యూనిట్ రూ 2. 44 లకు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ 3.54), ఏకంగా యూనిట్ రూ 8. 09 లకు కొనుగోలు చేసేలా ఆ ప్రభుత్వం అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకుంది. ఇలాంటి తప్పుడు చర్యల ఫలితంగా, డిసెంబర్ 31, 2019 నాటికీ డిస్కాములు రూ 29,000 కోట్లకు పైగా నష్టాలలో కూరుకుపోయాయి. విద్యుత్ ఉత్పత్తి దారులకు అప్పటికి మరో రూ.20,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది... రెవిన్యూ గ్యాప్ రూ 3,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు పెరిగిపోయింది. ఈ విధంగా అధిక రేట్లకు పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాబోయే 25 ఏళ్లలో ఏటా రూ 3,500 కోట్లు రాష్ట్రం అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది'' అని విద్యుత్ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
''రాష్ట్ర విభజన నాటికీ APPDCL(ఆంధ్ర ప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ) నిర్వహణకు సంబందించి ఎలాంటి రుణాలు లేవు. అయితే 2014-19 మధ్య కాలంలో రూ. 6000 కోట్ల మేర నిర్వహణ రుణాలు (OpEx) తీసుకోవటం జరిగింది. అలాగే కాపిటల్ రుణాలు రాష్ట్ర విభజన నాటికీ రూ. 7839.60 కోట్లు కాగా 2019 మార్చ్ 31 నాటికీ రూ.13253.68 కోట్లకు చేరాయి. ప్రస్తుతం APPDCL మొత్తం కాపిటల్ రుణాలు ఈ ఏడాది మార్చ్ 31 నాటికీ రూ 14159. 66 కోట్లు కాగా, నిర్వహణ రుణాలు మొత్తం రూ 5469. 36 కోట్లకు చేరాయి.. ఈ విధంగా చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి, చేతులు దులుపుకున్నారు'' అని ఆరోపించారు.
''ఈ మూడేళ్ళ కాలంలో రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యుత్ రంగంలో జరుగుతున్న దుబారా, దోపిడీ అరికట్టి గత మూడేళ్ళ లో విద్యుత్ కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ. 4925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయటం జరిగింది. 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించడంలో భాగంగా విద్యుత్ సంస్థలు 2019-20 సంవత్సరంలో 3,393 మిలియన్ యూనిట్లు, అలాగే 2020-21 లో మరో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసాయి. రాష్ట్రంలో అప్పటివరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఖరీదు సరాసరి యూనిట్ రూ 4.02/- కాగా మా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా సరాసరి యూనిట్ రూ 3.59/- లకే కొనుగోలు చేయగలిగింది'' అని మంత్రి తెలిపారు.
''గత తెలుగుదేశం ప్రభుత్వ సంస్కరణలు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసాయి. ప్రైవేటు కంపెనీలతో అడ్డగోలుగా చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల డిస్కాములు రూ 20 వేల కోట్లకు పైగా అప్పులో మునిగిపోయాయి. కరోనా సంక్షోభంలో కూడా ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు తీసుకోకపోయినా... ఒప్పందాల వల్ల వాటికి వందల కోట్లు రూపాయిలు స్థిర చార్జీలు రూపంలో చెల్లింపులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. యూనిట్ రూ. 2 కు దొరికే కరెంటు ను చంద్రబాబు ప్రభుత్వం తమకు నచ్చిన కంపెనీల నుంచి యూనిట్ రూ. 8 కు కొనడం ద్వారా ప్రజల నెత్తిన భారీ భారాన్ని మోపింది. ఈ అవకతవకలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు సైతం అందుకు పూర్తి సహకారాన్ని అందించాలి'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.
