20ఏళ్ల సమస్య... కానీ సీఎం జగన్ ఒక్క నిర్ణయంతో పరిష్కారం...: మంత్రి పెద్దిరెడ్డి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎంపిడిఓ ల ప్రమోషన్లపై నెలకొన్న సమస్య సీఎం జగన్ ఒక్క నిర్ణయంతో పరిష్కారమయ్యిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అమరావతి: ఏపీ పంచాయతీ రాజ్ శాఖలో 20 ఏళ్ళుగా పెండింగ్ లో వున్న సమస్యపై సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎంపిడిఓల సమస్యను పరిష్కరిస్తూ ప్రమోషన్లపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
''వివిధ కారణాలతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంపిడీఓలకు దీర్ఘకాలంగా పదోన్నతులు రాలేవు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు రాష్ట్ర విభజన తరువాత గత టిడిపి ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు ఈ సమస్యను తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదు. అయితే ప్రస్తుత సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి కాబట్టి వెంటనే వారి సమస్యను అర్ధం చేసుకుని పరిష్కరించారు'' అని మంత్రి వెల్లడించారు.
read more ప్రభుత్వం సమాచారం లీక్... మరో పదిమంది ఉద్యోగులపైనా సస్పెన్షన్ వేటు
''తాజాగా 255 మంది ఎంపిడిఓ లకు ప్రమోషన్ ఇస్తున్నాం. అలాగే ఎంపిడిఓల పదోన్నతులకు ఉన్న ఆటంకాలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తూ సీఎం చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 18,500 మంది 12కేడర్లకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది'' అన్నారు.
''ఇతర శాఖల నుంచి ఇప్పటి వరకు డ్వామా, డిఆర్డిఏ తదితర పోస్టుల కోసం అధికారులను మా శాఖకు తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఎస్ఐఆర్డీలో ఉద్యోగుల కొరత ఉండేది. ఇప్పుడు పదోన్నతుల వల్ల ఆ సమస్య కూడా తీరింది'' అని వెల్లడించారు.
''ఉద్యోగులు తమ సమస్యలను సిఎం జగన్ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తున్నారు. ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారిలో ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. పదోన్నతులు పొందిన 255 మంది ఎంపీడివోలను అభినందిస్తున్నా'' అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.