వెలగపూడి సచివాలయంలో మంగళవారం పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. అలాగే త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 ని రూపొందించనున్నట్లు... దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వెలగపూడి సచివాలయంలో మంగళవారం పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. లాజిస్టిక్ పాలసీ రూపకల్పనలో భాగంగా సింగపూర్ తరహా దేశాలలో మోడళ్లను పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. 

వ్యాపారులు, తయారీదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రికి వివరించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటును మంత్రి ప్రతిపాదించారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంపు సహా, నాన్ మేజర్ పోర్టులలో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026 కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు.

read more నాకు నేనే మెమోలు ఇచ్చుకొన్నట్టు: అధికారులపై వైఎస్ జగన్ ఆగ్రహం

''కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయనున్నాం. ఏపీఐఐసీ భూములలో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణణంలో సరకు రవాణాలో కీలకమైన ట్రక్ పార్కింగ్ బేల నిర్మాణం చేయనున్నాం. పార్కింగ్ బేలలో ఫ్యూయల్ స్టేషన్, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలకు ప్లాన్ చేస్తున్నాం'' అని మంత్రి తెలిపారు. 

ఎగుమతుల పాలసీపైనా ఆరా తీసిన పరిశ్రమల మంత్రి. అలాగే ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం పెట్రో కాంప్లెక్స్ కి సంబంధించిన ప్రస్తుత పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి. ఐటీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లను నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పుల దృష్ట్యా మరోసారి ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులను కలిసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు క్రిష్ణ వి గిరి, లంకా శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.