ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు.. పవన్ కల్యాణ్వి పిచ్చి కూతలు: మంత్రి జోగి రమేష్ ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు కుస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా అక్రమించుకున్న ప్రహారీ గోడలను మాత్రమే కూల్చామని చెప్పారు. అభివృద్దితో ఊరు బాగుపడుతుందని గ్రామస్తులు సంతోషంగా ఉన్నారని అన్నారు. శనివారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు కుస్తున్నారని మండిపడ్డారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది జరుగుతుంటే అక్కసుతో ఏమిటీ ఈ చేష్టలు అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర ఎవరూ రెక్కీ నిర్వహించలేదని.. చెంప పగిలేలా తెలంగాణ పోలీసులు వాస్తవం వెల్లడించారు. మద్యం మత్తులో ముగ్గురు గొడవపడ్డారని తెలంగాణ పోలీసులే చెప్పారని అన్నారు. తాగుబోతులు చేసిన గోడవకు.. రెక్కీ అని చెప్పడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. కూల్చివేతల గురించి మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో దేవాలయాలను కూడా కూల్చివేశారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో గాంధీ విగ్రహాన్ని చంద్రబాబు కూలగొట్టలేదా? అని ప్రశ్నించారు.
Also Read: ఇప్పటంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా పవన్ హడావిడి చేస్తున్నారు.. మంత్రి మేరుగ నాగార్జున మండిపాటు
పార్ట్ వన్ పవన్ కల్యాణ్ రెక్కీ డ్రామా.. పార్ట్ టూ చంద్రబాబు రాయి డ్రామా అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదని అన్నారు.
పవన్ కల్యాణ్ మీద రెక్కీ అనగానే చంద్రబాబు సానుభూతి ప్రదర్శించడం.. చంద్రబాబు మీద రాయి పడగానే పవన్ కల్యాణ్ ప్రేమ వలకబోస్తున్నారని విమర్శించారు. ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటించగానే చంద్రబాబు ట్వీట్ చేస్తున్నారని.. ఇంత ప్రేమ వలబోసుకునేటప్పడు రెండు పార్టీలు కలిసే సంసారమే చేయొచ్చుగా అని అన్నారు. ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. వీళ్లకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా.. గాజువాక, భీమవరంలో ఒంటరిగానే జనసేతోనే పోటీ చేస్తానని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్కు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని చంద్రబబాబు నాయుడు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని విమర్శించారు.