అచ్చెన్నాయుడికి దమ్ము, ధైర్యం వుంటే కుప్పంలోనైనా, టెక్కలిలోనైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. 98 శాతం హామీలు అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని జోగి రమేష్ ప్రశంసించారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లేదు ఏమీ లేదు అన్న వ్యక్తి ఏదేదో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. మేనిఫెస్టోపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అచ్చెన్నాయుడికి దమ్ము, ధైర్యం వుంటే కుప్పంలోనైనా, టెక్కలిలోనైనా చర్చకు రావాలన్నారు. మీ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన పథకాలు ఏంటో అడుగుదామని జోగి రమేష్ పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో ఏం మేలు జరిగిందో.. ఇప్పుడు ఏం మేలు జరిగిందో అడుగుదామన్నారు. మీకు నచ్చిన గ్రామంలో చర్చకు మేం సిద్ధమని .. ఈ ఛాలెంజ్కు సమాధానం చెప్పమని అచ్చెన్నాయుడిని అడుగుతున్నానని జోగి రమేష్ ప్రశ్నించారు. మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి మీకైనా తెలుసా అని మంత్రి నిలదీశారు. మేనిఫెస్టో కాపీ కూడా టీడీపీ వెబ్సైట్లో లేదని.. దమ్ముంటే టీడీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలని జోగి రమేష్ ఛాలెంజ్ విసిరారు. అచ్చెన్నాయుడు మా మేనిఫెస్టో గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. 98 శాతం హామీలు అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని జోగి రమేష్ ప్రశంసించారు. ఎమ్మెల్యేలందరూ గడప గడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలు తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. వైసీపీది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని జోగి రమేష్ పేర్కొన్నారు.
ALso Read: సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు.. ‘అమ్మ ఒడిపై మాట తప్పారు’
అంతకుముందు ‘‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’’ పేరుతో టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని అచ్చెన్నాయుడు గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశారని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని , ఒక్కటీ నిజం వుండదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
