అమరావతినే రాజధానిగా వుంచితే.. విశాఖ కేంద్రంగా రాష్ట్రం ఇవ్వండి : మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
రాజధాని విషయంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే.. విశాఖ కేంద్రంగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అన్న ఆయన.. సైకిల్ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు
వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా వుంచితే విశాఖ కేంద్రంగా తాము చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ధర్మాన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తిరుగుతూ చంద్రబాబు అమరావతే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. విపక్షనేత మన చేతులతో మన కళ్లను పొడిచేలా మాట్లాడుతున్నారని ధర్మాన దుయ్యబట్టారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అన్న ఆయన.. సైకిల్ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. వైసీపీ సంక్షేమ పాలన చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
అంతకుముందు గత మంగళవారం శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ.. తనకు అవినీతి అంటేనే నచ్చదన్నారు. తనను గెలిపించిన ప్రజలు తలదించుకునేలా ఎప్పుడూ వ్యవహరించనని.. ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా వుండాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు. అవినీతి లేని సమాజం దిశగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు తగదన్నారు. తాను ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించాలంటూ ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆయనపై కేసులు వేస్తే.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటారని ధర్మాన ఎద్దేవా చేశారు.
ALso REad: ఒక్కపైసా అవినీతికి పాల్పడలేదు.. దమ్ముంటే నిరూపించండి : విపక్షాలకు మంత్రి ధర్మాన సవాల్
ఇకపోతే.. గత నెలలో ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కరణలు చేసే వారికే వ్యతిరేకత ఎక్కువ అన్నారు . సంస్కరణలకు ముందే ఫలితాలు రావని, అందుకే ప్రజల ఆమోదం రాదని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని... కారణం సంస్కరణలు అర్ధం చేసుకోలేకపోవడమేనని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంస్కరణలు చేయనివారిని నిందించాల్సింది పోయి.. సంస్కరణలు చేసేవారిపై విమర్శలు చేస్తున్నారనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి అన్ని విధాలుగా అర్హత వుంది విశాఖకేనని.. ఈ నగరమే మెయిన్ రాజధానిగా వుంటుందని ధర్మాన స్పష్టం చేశారు. అయితే ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... జగన్ సంస్కరణల బాట పట్టారని ధర్మాన ప్రసాదరావు ప్రశంసించారు.