వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు.. కానీ సీఎం జగనేమో : మంత్రి ధర్మాన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, తప్పుకుంటానని సీఎంకు చెప్పానని... కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈసారికి ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సైకిల్ పోవాలని స్వయంగా చంద్రబాబే పిలుపునిస్తున్నారని చురకలంటించారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, తప్పుకుంటానని సీఎంకు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈసారికి ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ సూచించారని ధర్మాన తెలిపారు. దీనిపై ఆలోచించేందుకు చాలా సమయం వుందని మంత్రి పేర్కొన్నారు.
ఇకపోతే.. ధర్మాన ప్రసాదరావు గతవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా వుంచితే విశాఖ కేంద్రంగా తాము చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ధర్మాన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తిరుగుతూ చంద్రబాబు అమరావతే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. విపక్షనేత మన చేతులతో మన కళ్లను పొడిచేలా మాట్లాడుతున్నారని ధర్మాన దుయ్యబట్టారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అన్న ఆయన.. సైకిల్ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. వైసీపీ సంక్షేమ పాలన చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
ALso REad: అమరావతినే రాజధానిగా వుంచితే.. విశాఖ కేంద్రంగా రాష్ట్రం ఇవ్వండి : మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు గత మంగళవారం శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ.. తనకు అవినీతి అంటేనే నచ్చదన్నారు. తనను గెలిపించిన ప్రజలు తలదించుకునేలా ఎప్పుడూ వ్యవహరించనని.. ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా వుండాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు. అవినీతి లేని సమాజం దిశగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు తగదన్నారు. తాను ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించాలంటూ ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆయనపై కేసులు వేస్తే.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటారని ధర్మాన ఎద్దేవా చేశారు