‘‘మీ అతి తెలివి మా దగ్గర కాదు.. మోదీ దగ్గర చూపించండి’’
బీజేపీ నేతలపై మండిపడ్డ దేవినేని
బీజేపీ నేతలు తమ అతి తెలివిని తమ దగ్గర కాదని.. మోదీ దగ్గర చూపించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలన్నారు.
ఏపీ సాగునీటిశాఖకు 19 స్కోచ్ అవార్డులు వచ్చాయని తెలిపారు. 6నెలలు తర్వాత కన్నా ఏ పార్టీలో ఉంటారో తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు. అధికారం ఉన్న పార్టీలోకి వెళ్లే నేతలకు తమని విమర్శించే హక్కు లేదని అన్నారు.
పోలవరానికి కేంద్రం నుంచి రూ.1,935 కోట్లు రావల్సి ఉందని తెలిపారు. పోలవరానికి చెందిన అన్ని అంశాలు ఆన్లైన్లో పొందుపర్చామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు.
ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నేతల దుగ్ధ ఏమిటో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతున్న భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన రెండో డీపీఆర్ను ఆమోదింప చేసుకునేందుకు జలవనరుల శాఖ అధికారులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
సీఎం చంద్రబాబు ముంపు మండలాలను సాధించకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదే కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.