విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక్కడ గతంలోనూ భవనాలున్నాయని..పవన్ రాద్థాంతం వల్ల గోరంత కూడా ప్రయోజనం లేదన్నారు

విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాద్థాంతం వల్ల గోరంత కూడా ప్రయోజనం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని.. ఇక్కడ గతంలోనూ భవనాలున్నాయని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఇకపోతే.. విజయనగరం జిల్లా గుంకలాం వద్ద రాష్ట్రంలోనే పెద్దదైన టౌన్‌షిప్‌లో జగనన్న కాలనీని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. గుంకలాంకు పవన్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇక్కడ 12 వేల మందికి పైగా లబ్ధిదారులకు లే అవుట్‌లు వేశామని.. రూ 5 లక్షల విలువైన స్థలంతో పాటు ఇంటికి లక్షన్నర నగదును ఇస్తున్నట్లు వీరభద్రస్వామి అన్నారు. కాలనీలో ఇప్పటికే 108 బోర్లు , కరెంట్ ఇచ్చామని... రోడ్లు వేస్తున్నామని లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్, ఇనుమును అందుబాటులో వుంచినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఇక్కడ 8 వేల మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుండగా.. 2 వేలమంది మాత్రం సొంతంగా నిర్మించుకుంటామని చెప్పారని వీరభద్రస్వామి వెల్లడించారు. 

ALso Read:రిషికొండను పరిశీలించిన పవన్ కల్యాణ్... మట్టి గుట్టపైకెక్కి, అంతా తిరుగుతూ ఆరా (వీడియో)

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. జనసేన రాజకీయ పార్టీయే కాదని, సినిమా పార్టీ అంటూ సెటైర్లు వేశారు. జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. టీడీపీతోనే జనసేనకు శాశ్వత పొత్తు అని.. మిగిలినవన్నీ స్టెప్నీలేనని సెటైర్ల వేశారు అమర్‌నాథ్. ప్రధాని మోడీ సభ సక్సెస్‌ను డైవర్ట్ చేయడానికే పవన్ కల్యాణ్ రుషికొండకు వెళ్లారని ఆయన ఆరోపించారు. 

అంతకుముందు విశాఖ పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నగరంలోని రుషికొండను పరిశీలించారు. ఇటీవల రుషికొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని విశాఖను వీడిన వెంటనే స్థానిక జనసేన నేతలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు పవన్. అనంతరం కొండపై జరుగుతున్న పనులు ఏంటని ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ వున్న గుట్టపైకెక్కి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు పవన్.