చంద్రబాబుకు పవన్ రాజకీయ బినామీ: బొత్స సంచలనం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ అని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కారణంగానే టీడీపీ వాయిస్ను పవన్ కళ్యాణ్ విన్పిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.. అమరావతి విషయంలో టీడీపీ ఏది చెప్పిందో అవే మాటలను పవన్ కళ్యాణ్ కూడ విన్పిస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
అమరావతిలో నిర్మాణాలకు మూడు రెట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు.రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని మంత్రి ఆరోపించారు.
అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకొంటూ పాలన సాగిస్తున్నామని మంత్రి బొత్స చెప్పారు.
దొనకొండా.. అదెక్కడుంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వేస్తామని ఆయన తెలిపారు.