పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేం: మంత్రి అంబటి
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు చిత్తశుద్దే లేదని విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా అబద్దాలమయయేనని ఆరోపించారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేమని అన్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని మాత్రం చెప్పగలమని తెలిపారు.
టీడీపీ హయాంలో తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని విమర్శించారు. చంద్రబాబు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని అన్నారు. చంద్రబాబు హయంలో అన్నీ కరువుకాటకాలే అని విమర్శించారు. చంద్రబాబు చిత్తశుద్ది ప్యాకేజ్పైనే తప్ప ప్రాజెక్టుపై లేదని అన్నారు. రాష్ట్రానికి, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పోలవరం మొదటి దశకే కేంద్రం నిధులు మంజూరు చేసిందని.. ఆర్అండ్ఆర్, భూసేకరణ కేంద్రం భరించాల్సిందేనని అన్నారు.
కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. 2013-14 రేట్లకు ఒప్పుకుని పోలవరాన్ని 2016 రేట్లకు నవయుగకు ఇచ్చారని అన్నారు. 2019 నాటికి పోలవరం 48.39 శాతం మాత్రమే పూర్తైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో క్రిటికల్ పనులు అన్నీ వైసీపీ ప్రభుత్వమే చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అన్నారని చెప్పారు. టీడీపీ హయాంలో కమీషన్ల కోసమే తాపత్రయపడ్డారని విమర్శించారు. చంద్రబాబు నైజం గురించి ప్రధాని మోదీకి బాగా తెలుసునని అన్నారు. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పాలని కోరారు. చంద్రబాబు అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబును తాను తిట్టలేనా? కానీ తనకు సంస్కారం ఉందని చెప్పారు.