మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన కన్నా అనుచరుడు సూరిబాబుతో మంత్రి అంబటి రాంబాబు సీక్రెట్గా భేటీ అయ్యారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనుచరుడితో మంత్రి అంబటి రాంబాబు రహస్యంగా భేటీ అయినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. కన్నా అనుచరుడు పక్కాల సూరిబాబుతో అంబటి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. సూరిబాబు నివాసానికి ఆదివారం మంత్రి స్వయంగా వెళ్లారు. అంబటి రాంబాబు, సూరిబాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. నిన్న శివరాత్రి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక పోలేరమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.. తన అనుచరులు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also REad: టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ :ఈ నెల 23న బాబు సమక్షంలో చేరిక
ఇకపోతే.. కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు. గురువారం ఆయన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు.
రాష్ట్ర పార్టీ పనితీరు నచ్చకనే రాజీనామా..
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు. సోమువీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని విమర్శించారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు.
