ఆ తప్పు మళ్లీ చేయకండి..నన్ను ‘రెడ్డి’గా మార్చకండి.. పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి అమర్ నాథ్...
తాను అమర్ నాథ్ మాత్రమే అని.. అమర్ నాథ్ రెడ్డిని చేయకండని పరిశ్రమల ప్రతినిధులతో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు. గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని సూచించారు.
అచ్యుతాపురం : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ నిన్న పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘అమర్నాథ్ రెడ్డిగా పిలిచి నన్ను రెడ్డిగా మార్చకండి’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పిన ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవానికి ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి శుక్రవారం కంపెనీ లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్వానం పలికే వారికి పూర్తిగా అవగాహన లేక తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కంపెనీ సీఈఓ.. జపాన్ ప్రతినిధులు అందరూ అమర్నాథరెడ్డి గానే సంబోధించి మాట్లాడారని గుర్తు చేశారు.టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో మళ్లీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూడాలని, కంపెనీ తరఫున ఎంత మంది హాజరవుతారని తెలుసుకుని, మిగిలినవి పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో నింపాలని నిర్దేశించారు.
అచ్యుతాపురం సెజ్ లో విషవాయువుల లీకేజీ: మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు
ఇక ఏటిజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాక్షి పత్రిక, టీవీ, సమాచార శాఖలకు తప్ప మిగిలిన ఎవరికీ పాసులు జారీ చేయొద్దని మంత్రి అధికారులకు సూచించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సమాచార శాఖ ద్వారా మిగిలిన చానల్స్, పత్రికలు ఇన్ పుట్స్ తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.