సీలేరు నది పడవ ప్రమాదం... అధికారులకు ఆళ్ల నాని కీలక ఆదేశాలు
సీలేరు నదిలో చోటుచేసుకున్న పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.
విశాఖపట్నం జిల్లా సిలేరు రిజర్వాయర్ లో ప్రయాణికులతో కూడిన నాటు పడవలు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఈ ప్రమాదంలో పలువురి మృతిపట్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి తాత్సారం లేకుండా సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని అదేశించారు మంత్రి ఆళ్ల నాని.
ఈ ప్రమాదం గురించి వివరాలు తెలుసుకునేందకు మంత్రి డిఎంహెచ్వో డాక్టర్ సూర్య నారాయణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి తో ఫోన్ లో మాట్లాడారు. ఈ పడవ ప్రమాదంలో 8మంది గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారం వుందని డిఎంహెచ్వో మంత్రికి తెలిపారు. ఇలా గల్లంతయిన వారిలో ఓ చిన్నారి కూడా వుందని తెలిపారు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నుండి కూడా ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్న మంత్రి.
read more సీలేరు నదిలో పడవలు బోల్తా: 8 మంది వలస కూలీలు గల్లంతు
పడవ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి అదేశించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి నాని అదేశించారు.
విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతయ్యారు. కొందరు గిరిజనులు తెలంగాణ ఒడిశా వెళ్లేందుకు నాటు పడవలో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వలస కూలీలు 11 మంది ఒడిశా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాటు పడవల్లో వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతయిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.