కర్నూల్ లో దారుణం... ప్రియుడి చేతిలో మోసపోయి గర్భిణి వివాహిత ఆత్మహత్య
భర్తను కోల్పోయి పుట్టెడుదు:ఖంలో వున్న ఆమె మరో వ్యక్తి ప్రేమను నమ్మి మోసపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఆమె బిడ్డను ఒంటరి చేసి ఆత్మహత్యకు పాల్పడింది.
కర్నూల్ : చిన్న వయసులోనే భర్త మృతితో ఒంటరిగా మారిన వివాహితను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడో దుర్మార్గుడు. మాయమాటలు నమ్మి పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. పెళ్ళిచేసుకోవాలని ప్రియున్ని అడగ్గా అందుకు అతడు నిరాకరించడంతో మోసపోయానని గ్రహించిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదోని సమీపంలోని కోసిగి గ్రామానికి చెందిన తాయమ్మ(30)కు హన్మంతుతో వివాహమయ్యింది. వీరికి ఓ ఆడబిడ్డ సంతానం. వీరి సంసారం హాయిగా సాగుతుండగా హన్మంతు హఠాత్తుగా మృతిచెందాడు. దీంతో ఒంటరిగా మారిన తాయమ్మ తన బిడ్డతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. అక్కడే పనులు చేసుకుంటూ కూతుర్ని పోషించుకునేంది. ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కన్నేసాడు. మాయమాటలతో తాయమ్మకు శారీరకంగా దగ్గరవడమే కాదు సహజీవనం చేయసాగాడు.
Read More టాయిలెట్ లో ఉరివేసుకుని మైనర్ యువతి ఆత్మహత్య....
ప్రియుడితో కలిసి రెండేళ్ల సహజీవనం ఫలితంగా తాయమ్మ గర్భం దాల్చింది. దీంతో భర్త లేకున్నా గర్భం దాల్చినట్లు బయటపడితే పరువు పోతుందని ఆమె ఆందోళనకు గురయ్యింది. దీంతో తనను అందరిముందూ పెళ్లిచేసుకుని భార్యగా స్వీకరించాలని ప్రియున్ని కోరింది. అయితే అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలుండటంతో అందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రియుడి ఇంటిముందే తాయమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను కుటుంబసభ్యులు కోసిగి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. తాయమ్మ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.