బెయిల్పై వచ్చిన పెద్దలకు జైలంటే ఇష్టమేమో : విజయసాయిరెడ్డికి అశోక్ గజపతి కౌంటర్
వైసీపీ అధికారంలోకి రాగానే ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని.. ఎప్పుడు మాట్లాడినా నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారంటూ అశోక్ గజపతి రాజు ధ్వజమెత్తారు. బహుశా బెయిల్పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి.
తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే ట్రస్టు ఆనవాయితీలను పాటించే విషయంలో అడ్డు రాకూడదని అశోక్ గజపతిరాజు సూచించారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు.
Also Read:ధర్మకర్తనా, అధర్మకర్తనా?: ఆశోక్గజపతిరాజుపై ఎంపీ విజయసాయి ఫైర్
ట్రస్టు పేరు చెప్పి కొంత మంది టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో? ఎందుకు విడిచిపెట్టారో? ఇప్పటికీ ప్రశ్నగానే ఉందని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని ఆక్షేపించారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ట్రస్టుపై ఎందుకు దృష్టి పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని.. ఎప్పుడు మాట్లాడినా నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారంటూ అశోక్ గజపతి రాజు ధ్వజమెత్తారు. బహుశా బెయిల్పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి.