మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం
వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన మహర్షి సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మహర్షి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఓ అభిమాని విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
రాజమహేంద్రవరం: తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతాకాదు. సినిమా రిలీజ్ కు ముందు వారం రోజుల నుంచే అభిమానులు అనేక కార్యక్రమాలు చేపడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటారు.
కొంతమంది ధియేటర్ ను ఫ్లెక్సీలతో కప్పేస్తే...మరికొందరు నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని తెలియజేస్తుంటారు. తమ అభిమాన హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హంగామా చేస్తూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు అనేకం.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన మహర్షి సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మహర్షి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఓ అభిమాని విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ధవళేశ్వరంలోని మురళీకృష్ణ థియేటర్ పక్క భవనంపై ఫ్లెక్సీ కట్టేందుకు రాజీవ్ (26) అనే యువకుడు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
విషయం గమనించిన స్నేహితులు, మహేశ్ అభిమానులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమద్యలో రాజీవ్ కన్నుమూశాడు. రాజీవ్ మరణంతో ధవళేశ్వరంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.