మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: శివ నామస్మరణలో పద్మజ, అందరితో కలిసి భోజనం
ఇద్దరు కూతుళ్లను క్షుద్రపూజలు చేసిన మట్టుబెట్టిన తల్లి పద్మజ మదనపల్లె సబ్ జైలులో బుధవారం రాత్రంతా శివనామస్మరణ చేస్తూనే ఉన్నట్లు తెలిసింది. మిగతా ఖైదీలతో కలిసి భోజనం చేసినట్లు చెబుతున్నారు.
చిత్తూరు: కూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితురాలైన పద్మజ బుధవారం రాత్రంతా శివనామస్మరణతో గడిపినట్లు తెలుస్తోంది. అందరితో కలిపి తననూ మహిళా బ్యారక్ లోనే ఉంచాలని పద్మజ చిత్తూరు జిల్లా మదనపల్లె స్పెషల్ సబ్ జైలు అధికారులను కోరినట్లు సమాచారం. దీంతో ఆమెను ఇతర మహిళా నిందితులతో కలిపి ఉంచినట్లు తెలుస్తోంది.
మిగతా నిందితులతో పాటు ఆమె కలిసి బుధవారం రాత్రి భోజనం చేసినట్లు చేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం మాత్రం ప్రత్యేక బ్యారక్ కు మార్చి అదనపు సిబ్బందిని నియమించారు. పద్మజ భర్త పురుషోత్తంనాయుడు ప్రవర్తన సాధారాణగానే ఉందని తెలుస్తోంది.
Also Read: మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: పరాకాష్టకు చేరిన అలేఖ్య ఉన్మాద భక్తి.
కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలను క్షుద్రపూజలు చేసి చంపిన పురుషోత్తం నాయుడు, పద్మజలను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించాలని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మానసిక వైద్యురాలు రాధిక నివేదిక సమర్పించారు. దీంతో జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి జైలు వద్దకు వచ్చిన పోలీసులు కోర్టు ఆదేశాలు రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు.
అక్కాచెల్లెళ్ల హత్య జరగడానికి ముందు రోజు ఉదయం శివనగర్ లోని ఇంటికి వచ్చిన మాంత్రికుడు సుబ్బరామయ్యను పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తంనాయుడి ఇంటికి వచ్చినప్పుడు తాను చూసిన పరిస్థితులను అతను పోలీసులకు వివరిచాడు.
Also Read: వాళ్లకు తాయెత్తులు కట్టాను, ఓ వ్యక్తి శంఖం ఊదాడు: మదనపల్లి అక్కాచెల్లెళ్ల మర్డర్స్పై భూత వైద్యుడు
తాను ఈ నెల 23వ తేదీన పురుషోత్తంనాయుడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ 40-50 ఏళ్ల వయస్సు గల ఓ బక్కపలచటి మనిషి ఉన్నాడని, స్పృహలో లేని అలేఖ్య చెవిలో అతను శంఖం ఊదుతున్నాడని మాంత్రికుడు చెప్పిన విషయం తెలిసిందే. హత్యలు జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లిన వ్యక్తుల వాంగ్మూలాలు కూడా పోలీసులు రికార్డు చేస్తున్నారు.