టిడిపి‌-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభను ఇరుపార్టీల శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ బాలశౌరి జనసైనికుల కోసం భారీ వాహనాలను సిద్దం చేసారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అధికార వైసపి 'సిద్దం' పేరిట భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. వైసిపికి పోటీగా టిడిపి-జనసేన కూటమి కూడా ప్రచార రంగంలోకి దిగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగసభకు సర్వం సిద్దమయ్యింది. భారీగా జనసమీకరణ చేపట్టి సభను సక్సెస్ చేసేందుకు ఇరుపార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం నుండి భారీగా నాయకులు, కార్యకర్తల తరలింపుకు ఏర్పాట్లు చేసినట్లు జనసేన నాయకులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇవాళ(బుధవారం) జరగనున్న టిడిపి-జనసేన కూటమి తొలి బహిరంగసభకు ఒక్క మచిలీపట్నం నుండే వెయ్యి కార్లు వెళుతున్నట్లు బాలశౌరి తెలిపారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ఇలా భారీగా ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసామన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివెళ్లనున్నట్లు తెలిపారు. జనసేన శ్రేణులు కదంతొక్కుతూ మచిలీపట్నం నుండి తాడేపల్లిగూడెంకు పయనం కానున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. 

ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ మాట్లాడుతూ... వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం టిడిపి-జనసేన కూటమి పోరాడుతోందన్నారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ బాగుకోసం ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలుగోడి ఆత్మ గౌరవాన్ని కాపాడటం టిడిపి-జనసేన కూటమితోనే సాధ్యమని ప్రజలు కూడా నమ్ముతున్నారు... అందువల్లే గెలిపించేందుకు సమాయత్తం అవుతున్నారని అన్నారు. కాబట్టి తాడేపల్లిగూడెంలో నిర్వహించే బహిరంగసభకు ప్రజలు భారీగా తరలిరానున్నారని బాలశౌరి తెలిపారు. 

Also Read Janasena: చంద్రబాబు చేతిలో పవన్ మోసపోయాడా? వెల్లువెత్తుతున్న జనసైనికుల ఆగ్రహం

ఇక సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో టిడిపి-జనసేన కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 'జెండా' పేరిట తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న తొలి బహిరంగసభతోనే తమ బలాన్ని అధికారపార్టీకి చూపించాలని చూస్తోంది. అంతేకాదు ఎన్నికల వేళ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఈ బహిరంగ సభను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్న టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు,పవన్ కల్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

టిడిపి-జనసేన ఉమ్మడి ప్రచారసభ కోసం తాడేపల్లిగూడెంలో 26 ఎకరాల విశాల స్థలాన్ని సిద్దంచేసారు. మొత్తం 33 గ్యాలరీలను ఏర్పాటుచేయగా అందులో మూడు విఐపిలకు, 3 మహిళలకు, ఓ గ్యాలరీ మీడియాకు కేటాయించారు. దాదాపుగా 5 నుండి 6 లక్షల మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటుచేసారు. వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చే పార్టీ శ్రేణులు, ప్రజల వాహనాల కోసం భారీ పార్కింగ్ స్థలం కేటాయించారు. జాతీయ రహదారికి ఆనుకునే సభాస్థలం వుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లుచేసారు.