విశాఖపట్నం జిల్లా మధురవాడలో జిరగిన చిన్నారి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. తల్లి ప్రియుడే సంధ్యశ్రీని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. జగదీష్ పోలీసు కస్టడీలో ఉన్నాడు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మధురవాడలో జరిగిన చిన్నారి సంధ్యశ్రీ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సంధ్య శ్రీ తల్లి వరలక్ష్మి ప్రియుడే హంతకుడని పోలీసులు తేల్చారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు తొలుత కేసును నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో సాంధ్యశ్రీని చంపి అంత్యక్రియలు చేసినట్లు తేల్చుకున్నారు 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివాహేతర సంబంధమే సంధ్యశ్రీ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. సంధ్యశ్రీని తానే హత్య చేసినట్లు వరలక్ష్మి ప్రియుడు జగదీష్ అంగీకరించాడు. ఈ హత్యలో వరలక్ష్మి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

See Video: వివాహేతర బంధానికి అడ్డుగావుందని... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లి

వరలక్ష్మికి ఐదేళ్ల క్రితం లారీ క్లీనర్ రమేష్ తో వివాహమైంది. వారికి సంధ్యశ్రీ జన్మించింది. సంధ్యశ్రీకి ప్రస్తుతం మూడేళ్ల వయస్సు ఉంది. గత ఏడాది కాలంగా అదే ప్రాంతానికి చెందిన జగదీష్ అనే వ్యక్తితో వరలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం రమేష్ కు తెలియడంతో దంపతుల మధ్య గొడవ జరుగుతూ వచ్చింది. చివరకు వరలక్ష్మిని నిలదీయడం కూడా రమేష్ మానేశాడు. 

ఆ తర్వాత వరలక్ష్మి కూతురు సంధ్యశ్రీని తీసుకుని ప్రియుడు జగదీష్ ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో సంధ్యశ్రీని జగదీష్ హత్య చేసినట్లు చెబుతున్నారు ఆ తర్వాత అర్థరాత్రి పాపకు అంత్యక్రియలు చేశారు సంధ్యశ్రీ మరణం గురించి తెలిసిన స్థానికులు వరలక్ష్మిపై దాడి కూడా చేశారు. 

రమేష్ తన కూతురి మరణం విషయంలో అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంధ్యశ్రీని తానే హత్య చేశానని అంగీకరిస్తూ జగదీష్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో జగదీష్ ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు.