గుంటూరు: అధికారుల అత్యుత్సాహం... చెత్త వాహనంలో వినాయక విగ్రహాలు తరలింపు (వీడియో)
హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే వినాయక విగ్రహాలను ఓ శానిటరీ అధికారి అత్యుత్సాహంతో చెత్తను తరలించే వాహనంలో తరలించాడు. గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై వివాదం రేగడంతో సదరు ఉద్యోగిని మున్సిపల్ కమీషనర్ విధుల నుండి తొలగించారు.
అమరావతి: వినాయకచవితి వేడుకులపై వైసిపి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇప్పటికే ఏపీలో బిజెపితో పాటు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో గుంటూరు జిల్లాలో ఓ అధికారి అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త వాహనంలో తరలించి మరో వివాదానికి తెరతీశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ చెత్త వాహనంలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
గుంటూరు నగరంలో శానిటేషన్ అధికారులు అతి చేశారు. రోడ్డుపక్కన అమ్మకానికి పెట్టిన వినాయకుడి విగ్రహాలను అధికారులు మున్సిపల్ చెత్త వాహనంలో ఎక్కించి తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై వినాయకుడి విగ్రహాలు అమ్మకానికి పెట్టారంటూ మున్సిపల్ చెత్తతరలించే ట్రాక్టర్ లో ఆ విగ్రహాలను తరలించారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే వినాయక విగ్రహాలను ఇలా తరలించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ సంప్రదాయన్నీ కించపరిచే విధంగా వ్యవహరించిన శానిటేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
అయితే ఈ ఘటనపై సోషల్ మీడియా, మీడియాలో దుమారం రేగుతుండటంతో నగర మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. విగ్రహాలను చెత్త వాహనంలో తరలిచిన శానిటరీ సూపర్వైజర్ విధుల నుండి తొలగించడమే కాదు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు.
read more వినాయకచవితి వివాదం... ఇలాగయితే మీ మీదా కేసులు తప్పవు: బిజెపి శ్రేణులకు మంత్రి వెల్లంపల్లి వార్నింగ్
ఓ హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు మేరకు స్థానిక శానిటరీ సూపర్వైజర్ (అవుట్ సోర్సింగ్) ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను చెత్త ట్రాక్టర్లో వేయించారని యం.ఎల్.ఓ మహేష్ తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన కమిషనర్ సూపర్వైజర్ ని విధుల నుండి తొలగించి విచారణకు ఆదేశించారని అన్నారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ స్పష్టం చేశారు.