కేంద్రానికి మొదటిసారి తెలుగోడి అవిశ్వాసం దెబ్బ
కేంద్రంపై ఓ తెలుగు రాష్ట్రానికి చెందిన ఎంపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణం చర్చకు రావడం ఇదే తొలిసారి. విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ చేపట్టడంతో కేశినేని నాని పేరు మార్మోగిపోతోంది.
న్యూఢిల్లీ: కేంద్రంపై ఓ తెలుగు రాష్ట్రానికి చెందిన ఎంపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణం చర్చకు రావడం ఇదే తొలిసారి. విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ చేపట్టడంతో కేశినేని నాని పేరు మార్మోగిపోతోంది.
విజయవాడ నుండి కేశినేని నాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రతిపాదిస్తూ టీడీపీకి చెందిన కేశినేని నానితో పాటు కొనకళ్లనారాయణరావు , తోట నరసింహం తదితరులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడ అవిశ్వాస నోటీసులను ఇచ్చాయి.
కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసులు అందిన విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభలో ప్రకటించారు. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రతిపాదించాలని ఆమె కేశినేని నాని కోరారు. దీంతో బుధవారం నాడు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మాణాన్ని కేశినేని నాని ప్రతిపాదించారు.
ఈ తీర్మాణానికి మద్దతుగా కాంగ్రెస్సహా కొన్ని విపక్ష పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు. అవిశ్వాసానికి 50 మంది ఎంపీలకు పైగా మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మాణంపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
అయితే తెలుగు రాష్ట్రానికి చెందిన ఎంపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై చర్చ చేపట్టడం బహుశా లోక్సభ చరిత్రలో ఇదే ప్రథమంగా భావిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ విషయమై ఇతర పార్టీల మద్దతును కూడగడుతున్నారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంపై చర్చకు కేంద్రం ఒప్పుకోవడం రాజకీయంగా టీడీపీకి కలిసివస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో అవిశ్వాసంపై కేంద్రం చర్చకు ఒప్పుకోవడం ఏపీ ప్రజల విజయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడుతున్నారు.