తెలుగుదేశం పార్టీ ఓ యూనివర్సిటీ లాంటిదని  ఇందులో  చేరేందుకు విద్యార్థులు జంకాల్సిన అవసరం లేదని నారా లోకేశ్  సలహా  ఇస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలుగుదేశం ప్రారంభించిన జనచైతన్య యాత్రలో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు నిన్న అనంతపురం (పై ఫోటో) పర్యటించారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. వందలాది విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించి, వారిలో రాజకీయ చైతన్యం కల్గించేందుకు ఆయన శ్రమిస్తున్నారు.

 తెలుగు యువతరానికి ఆయనను ప్రతినిధిని చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ యాత్రలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఆయన చేత రాజకీయ ప్రవచనాలు చేయిస్తున్నది. ఎక్కడ బడి తే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలుండటం అధికార పార్టీకి బాగా ఉపయోగపడుతూ ఉంది. చిన బాబు వెళ్తున్న ప్రతిచోట ఇంజనీరింగ్ విద్యార్థులను పోగేసుకొచ్చి ఆయనకు స్వాగతం చెప్పించడం, జైకొట్టించడం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మీద అధార పడిన కళాశాలల యాజమన్యాలు కూడా యువజనంలో చైతన్యం తీసుకువచ్చేందుకు చిన బాబు చేస్తున్న కృషికి బాగా సహరిస్తున్నాయి. ఇలా దొరికిపోయిన విద్యార్థుల మధ్య లోకేశ్ ప్రసంగాలు చాలా ఘాటుగా సాగుతున్నాయి. 

రాజకీయాల్లోకి వచ్చేందుకు తొందరేం లేదని ఆర్థికంగా స్థిరపడ్డాకే యువత రాజకీయాల్లోకి రావాలని చెబుతూనే తెలుగుదేశం పార్టీ ఓ యూనివర్సిటీ లాంటిదని చేరేందుకు జంకాల్సిన అవసరం లేదని ఆయన సలహా ఇస్తున్నారు.

ఈ పర్యటనలో ప్రతిపక్ష నాయకుడు , వైఎస్ఆర్ సి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరుగుతున్నరు. చాలా తీవ్రమయిన విమర్శలు చేస్తున్నారు.

అమరావతి ఎందుకంత పెద్ద నగరంగా, ప్రపంచ స్థాయి మహానగరంగా ఉండాలో ఇంతవరకు ప్రభుత్వం దగ్గిర నుంచి సరైన సమాధానం రాలేదు. ఇంతపెద్దనగరం ఎందుకనీ పర్యావరణ వేత్తలంతా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా ప్రవేశించింది. వారం రోజుల కిందట జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ తానైతే ఇంత పెద్ద అమరావతి కట్టనని చెప్పాడు. 

అలాంటపుడు మహానగరం అమరావతిని తనదయిన స్టయిల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు సమర్థించారు. ఆయన తీరు ఇది.

“ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో పెద్ద భవనం ఉంది. దాని విస్తీర్ణయం 32 ఎకారాలు. ఒక్క కుటుంబం కోసం జగన్ ఇంత పెద్ద భవంతి కట్టుకోవచ్చ. అయిదుకోట్ల మంది ప్రజలకు 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించవద్దా,” అని నారా లోకేశ్ తన ఎదురుగా కూర్చుని ఉన్న విద్యార్థులను ప్రశ్నించారు.

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండటం మన దౌర్భాగ్యం. ఆయన అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యాడు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటే ఆయన దానిని అడ్డుకుంటున్నారు,’ అని ఆయన అనంతపురం విద్యార్థులకు చెప్పారు.’ నాకు మా నాన్నకు విబేధాలు సృష్టించేందుకు కూడా జగన్ ప్రయత్నిస్తున్నాడు,’ అని కూడా లోకేశ్ అన్నారని ఆయనతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిక చేశారు. గురువారం ఆయన తిరుపతిలోని చదలవాడ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. చిత్తూరు జిల్లా మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

.