పరిషత్ ఎన్నికలు: చంద్రబాబు నిర్ణయానికి అడ్డం తిరుగుతున్న టీడీపీ నేతలు
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే చంద్రబాబు నీర్ణయానికి పలు చోట్ల టీడీపీ నేతలు అడ్డం తిరుగుతున్నారు. పోటీలో ఉంటామని చెబుతున్నారు. అశోక్ గజపతి రాజు, సత్యనారాయణ మూర్తి ప్రచారంలోకి కూడా దిగారు.
అమరావతి: పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నిర్ణయానికి పలు చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డం తిరుగుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం, ఎన్నికలను బహిష్కరంచడం వంటి చర్యల వల్ల క్యాడర్ చెల్లాచేదురవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఓడినా, గెలిచినా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పోటీ చేయడం అవసరమని టీడీపీ సీనియర్ నేత పి. అశోక్ గజపతి రాజు అన్నారు.
విజయనగరం జిల్లాలో అభ్యర్థులను, కార్యర్తలను వెంట పెట్టుకుని అశోక్ గజపతి రాజు ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అలాగే, విశాఖపట్నంలో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి తన వర్గాన్ని వెంట పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం పార్టీ గందరగోళంలో పడేసిందని విశాఖకు చెందిన గండి బాబ్జీ అన్నారు చంద్రబాబు నిర్ణయంతో అయోమయ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
Also Read: పరిషత్ ఎన్నికల బహిష్కరణ: చంద్రబాబు నిర్ణయం మిస్ ఫైర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మంగళగిరి శానససభ నియోజకవర్గంలోని దుగ్గిరాలలో పోటీ చేసి తీరుతామని నాయకులు చెబుతున్నారు. తాము పోటీ చేస్తామని మండల అధ్యక్షుడు గూడూరు వెంకటరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తాము పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పోటీ నుంచి తప్పుకుంటే క్యాడర్ చెల్లాచెదురై పోతుందని అన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తమ నిర్ణయం అధినేత చంద్రబాబును ధిక్కరించినట్లు కాదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు పోటీ చేస్తామని, ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్తామని, ఆ తర్వాత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో చాలో చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
Also Read: నీలం సాహ్నీకి షాక్: ఏపీ పరిషత్ ఎన్నికలపై జనసేన హౌస్ మోషన్ పిటిషన్
పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్తుల తరఫున ప్రచారం సాగిస్తామని కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి చెప్పారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగిస్తున్నామంటూనే ఆయన తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. అధికార పార్టీవాళ్లు బుద్ధి పుట్టినట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎన్నికలను బహిష్కరించడం సరైందేనని ఆయన అన్నారు అయితే, తమ నియోజకవర్గంలో గలాటాలు లేవని, పోటీ నుంచి తప్పుకుంటే చేతకానితనం అవుతుందని ఆయన అన్నారు.