చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి, ఎన్టీఆర్ కూతురు కోరికను తీరుద్దాం.. : కొడాలి నాని
ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు. ఆయనకు రెస్ట్ ఇద్దాం. నన్ను గెలిపిస్తారా? చంద్రబాబును గెలిపిస్తారా? అంటూ నారాభువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారాయి.
గుడివాడ : వైసీపీ నేత కొడాలి నాని తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపైసెటైర్లు వేశారు. నారా భువనేశ్వరి గురువారం నాడు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఇదే అదనుగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొడాలి నాని కూడా స్పందించారు.
చంద్రబాబు నాయుడు భార్య ఆయనకి రెస్ట్ ఇవ్వాలని కోరుతుందని.. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని.. తన మనసులోని మాటనే భువనేశ్వరి బయట పెట్టిందని అన్నారు. ఎన్టీఆర్ మీద, ఆయన కూతురైన భువనేశ్వరి మీద గౌరవంతో ఆమె కోరినట్లుగా చంద్రబాబు నాయుడుకి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు రెస్టు ఇద్దామంటూ వ్యాఖ్యానించారు.
YCP Candidate: కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!
నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ…ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు. ఆయనకు రెస్ట్ ఇద్దాం. నన్ను గెలిపిస్తారా? చంద్రబాబును గెలిపిస్తారా? అంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
దీనిమీదే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్ పిల్లలు చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని అడుగుతున్నారు.. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి కూడా బాబు గారికి రెస్ట్ ఇవ్వాలని అంటున్నారు. అలా ఇద్దరు అగ్ర నాయకుల పిల్లలు చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచించుకోవాలి వారి మీద ఉన్న గౌరవంతో వారి కోరికను తీర్చాలి. బాగా ఆలోచించి చంద్రబాబుకు రెస్ట్ ఇప్పిద్దాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయనకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుదాం. ఎవరు ఎంత మందితో కలిసి వచ్చినా.. 2024లో చంద్రబాబుకు పూర్తిస్థాయి రెస్టు తప్పదు అంటూ వ్యాఖ్యానించారు.