మంత్రిపై భూ కబ్జా ఆరోపణలు
- భారీ పరిశ్రమల శాఖమంత్రి అమరనాధరెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ముసురుకుంటున్నాయి.
భారీ పరిశ్రమల శాఖమంత్రి అమరనాధరెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ముసురుకుంటున్నాయి. తిరుపతిలోని విలువైన ప్రాంతంలో గల 5 ఎకరాలను కబ్జా చేయాలని మంత్రి ప్రయత్నిస్తున్నట్లు ఇద్దరు మహిళలు మీడియా సమక్షంలో ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. 1964 నుండి తమ ఆధీనంలో ఉన్న విలువైన భూమిపై మంత్రి కన్నుపడిందని వారంటున్నారు. స్ధానికంగా ఉన్న బిల్డర్ శ్రీమన్నారాయణను అడ్డుపెట్టుకుని మంత్రి మేనల్లుడు తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు.
తమ భూములకు రెవిన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలను సృష్టించి తమను భూములనుండి ఖాళీ చేయాల్సిందిగా మంత్రి అధికార యంత్రాంగంతో ఒత్తిడిపెడుతున్నట్లు చిట్టి కృష్ణ, కళావతి ఆరోపించటం గమనార్హం. మంత్రి మనుషులు చూపిస్తున్న పత్రాలకు, తమ భూమి పత్రాలకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పిన వారు వినటం లేదన్నారు.
సరే, ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత ఎవరూ అంగీకరించరు కదా? మంత్రి కూడా అదే చేసారు లేండి. ఇదే విషయమై మంత్రి స్ధానిక మీడియాతో మాట్లాడుతూ, తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణల్లో అర్ధం లేదన్నారు. కావాలనే కొందరు తనపై బురదచల్లాలని చూస్తున్నట్లు మండిపడ్డారు. భూములపై ఎక్కడైనా వివాదాలుంటే కోర్టులో తేల్చుకోవాలని సదరు మహిళలకు మంత్రి సూచించారు.