సోనియాను ఇటలీ దెయ్యమన్నారు: చంద్రబాబును దుమ్మెత్తిపోసిన లక్ష్మీపార్వతి
గతంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఇటలీ దెయ్యమని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు లక్ష్మీపారవ్తి విమర్శించారు.
హైదరాబాద్ : గతంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఇటలీ దెయ్యమని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు లక్ష్మీపారవ్తి విమర్శించారు. టీడీపీనే పిల్ల కాంగ్రెస్ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైందని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తన స్వార్థం కోసం ఎన్నో తప్పటడుగులు వేస్తున్న చంద్రబాబు. నాడు టీడీపీని స్థాపించిన దివంగత నేత ఎన్టీఆర్ను మోసం చేయడానికి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలున్నాయని, అందుకే టీడీపీ పేరు ఇప్పటినుంచి పిల్ల కాంగ్రెస్ అని ఆమె అన్నారు.
పిల్ల కాంగ్రెస్, పిల్ల బీజేపీ, పిల్ల కమ్యూనిస్ట్ అన్నీ చంద్రబాబేనని ఆమె వ్యాఖ్యానించారు. బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్తో చంద్రబాబు ఎలా కలిశారో అందరూ చూశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని అభినందించిన తీరు చూస్తేనే పిల్ల కాంగ్రెస్ ఎవరో అర్థమైందని అన్నారు. గత నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజల వ్యతిరేకతతో చంద్రబాబు కూటమి నుంచి బయటకొచ్చారని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు కాంగ్రెస్తో కలవడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని, ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని ఆమె అన్నారు.