కే-ట్యాక్స్ వసూళ్ల ఆరోపణలు: కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం
హైకోర్టు ఆదేశాలతో కోడెల శివరాం మంగళవారం నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.
గుంటూరు : కే ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం ఎట్టకేలకు కోర్టు ఎదుట లొంగిపోయారు.
తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివరాం కే ట్యాక్స్ పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శివరాంపై పలు పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు సైతం నమోదు అయ్యాయి.
కేసుల విషయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు శివరాం. కోడెల శివరాం అభ్యర్థనపై హైకోర్టు కీలక సూచనలు చేసింది. కింది కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో కోడెల శివరాం మంగళవారం నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఇటీవలే కోడెల శివరాం తండ్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.