సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు: కొడాలి నాని
సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గురువారం అమరావతి సచివాలయం 4వ బ్లాకులో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గురువారం అమరావతి సచివాలయం 4వ బ్లాకులో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. పేదలు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5కిలోలు, 10కిలోలు, 15కిలోలతో కూడిన రేషన్ బియ్యం, ఆరు లేదా ఏడు రకాల వివిధ నిత్యావసర సరుకులతో కూడిన బ్యాగులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు.
అదేవిధంగా రైతులు పంట వేయకముందే వారు పండించనున్న పంటకు కనీస మద్ధతు ధరను ముందుగానే ప్రకటించి ప్రతి రైతుకు మద్ధతు ధరను అందించేందుకు వీలుగా బడ్జెట్లో రూ.3వేల కోట్లతో మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాట్లు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్, పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప అప్పారావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.