ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. జగన్ ఏపీ నూతనం సీఎంగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. జగన్ ఏపీ నూతనం సీఎంగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తన మంత్రి వర్గంలోకి జగన్ 25 మందికి చోటు కల్పించారు. అందులో కొడాలి నాని కూడా ఉన్నారు.
తనకు మంత్రి పదవి కేటాయించడం పట్ల కొడాలి నాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తనపై జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని చెప్పారు. ఎమ్మెల్యేగా గుడవాడ ప్రజలు తనను నాలుగుసార్లు గెలిపించారని అందుకు ప్రజలకు దన్యవాదాలు చెప్పారు.
ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని.. కానీ ముఖ్యమంత్రి మాత్రమే మంత్రి పదవి ఇస్తారని ఆయన అన్నారు. ‘‘151 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అవకాశాలు తక్కువగా ఉంటాయి. తొలి నుంచి వైఎస్ జగన్తో ఉండటం.. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, మా సామాజిక వర్గంలో ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తిని నేనే కావడంతో మంత్రిపదవి వరిస్తుందని ఆశించాను. కానీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అనుకోలేదు. అవకాశం ఉంటే వైఎస్ జగన్ తప్పుకుండా ఇస్తారనుకున్నా. అలానే ఆయన అవకాశం ఇచ్చారు. ఏ శాఖ ఇచ్చినా అవగాహన తెచ్చుకొని సామర్థ్యం పెంచుకుని పనిచేస్తా.’ అని తెలిపారు.
కొడాలి నాని గతంలో టీడీపీ నేతగా పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. అయితే.. తాను టీడీపీలోనే కొనసాగి ఉంటే.. అప్పుడే మంత్రి అయ్యేవాడినని కాకపోతే.. తాను మంత్రి పదవి కోసం వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే తాను టీడీపీని వీడినట్లు వివరించారు.
స్థానిక టీడీపీ నేతలతో పొసగకపోవడం.. ఎన్టీఆర్ కుటుంబ సన్నిహితుడునని చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాను గుడివాడ ప్రతిపక్ష ఎమ్మెల్యేనని, అయినా వైఎస్సార్ సంక్షేమ నిధులు తన నియోజకవర్గానికి ఇచ్చారని తెలిపారు.
అప్పుడే చంద్రబాబుకు, వైఎస్సార్కు ఉన్న వ్యత్యాసం తెలుసుకున్నానని, వైఎస్ జగన్పై అన్యాయంగా కేసులు బనాయించి పెట్టడం తాను దగ్గరుండి చూశానన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారని గ్రహించి.. జగన్కు అండగా ఉండాలని వైసీపీలోకి చేరానన్నారు.
