నా హ్యాట్రిక్ విజయం వైఎస్ జగన్ కే అంకితం..: కేశినేని నాని
తనపై నమ్మకంతో విజయవాడ లోక్ సభ నుండి పోటీచేసే అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ : తెలుగుదేశం పార్టీని వీడి ఇలా వైసిపిలో చేరారో లేదో అలా ఎంపీ టికెట్ పట్టేసారు కేశినేని నాని. తాజాగా వైసిపి ప్రకటించిన మూడో జాబితాలో విజయవాడ లోక్ సభ ఇంచార్జ్ బాధ్యతలు నానికి దక్కాయి. ఇలా విజయవాడ లోక్ సభ బరిలో ఈసారి వైసిపి నుండి పోటీకి సిద్దమయ్యారు నాని. ఈ క్రమంలోనే తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాని కృతజ్ఞతలు తెలిపారు.
ముచ్చటగా మూడోసారి ఎంపీగా గెలిచి వైఎస్ జగన్ కు అంకితమిస్తామనని నాని పేర్కొన్నారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసిపి జెండా ఎగరేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. విజయవాడలో వైసిపి జెండా సగర్వంగా ఎగరేస్తానని కేశినేని నాని అన్నారు.
ఇదిలావుంటే వైసిపి మూడో జాబితాలో విజయవాడతో పాటు మరికొన్ని లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సికి అవకాశం దక్కింది. ఆమెను విశాఖపట్నం నుండి బరిలోకి దింపుతోంది వైసిపి. ఇక శ్రీకాకుళం నుండి పేరాడ తిలక్, కర్నూల్ నుండి గుమ్మనూరు జయరాం, ఏలూరు నుండి కారుమూరి సునీల్ యాదవ్, తిరుపతి నుండి కోనేటి ఆదిమూలం ఎంపీలుగా పోటీ చేయనున్నారు.
Also Read ఏపీ రాజకీయాల్లో ‘తిరువూరు’ చిచ్చు.. వైసీపీకి రక్షణనిధి, టీడీపికి కేశినేని నాని షాక్ లు...
ఇక మూడో జాబితాలో మరికొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారుచేసింది వైసిపి. ఇందులో టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు, దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇచ్చాపురం - పిరియా విజయ, చిత్తూరు - విజయానందరెడ్డి, రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ) - డాక్టర్ మూతిరేవుల సునీల్ కుమార్ లకు అవకాశం దక్కింది. అలాగే మదనపల్లె - నిస్సార్ అహ్మద్, రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు - బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్, గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి, పెనమలూరు - జోగి రమేష్, పెడన - ఉప్పాల రాము లను ఇంచార్జీలుగా నియమిస్తూ ప్రకటన చేసింది వైసిపి.