ఆరోజే చంద్రబాబు బండారం బయటపెడతాం: కన్నా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బతుకంతా వాళ్లనీ, వీళ్లనీ విమర్శించడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బతుకంతా వాళ్లనీ, వీళ్లనీ విమర్శించడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు.
నలభైఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవంతో ఏం సాధించారని నిలదీశారు. ఓటుకునోటు వంటి కేసుల్లో ఇరుక్కుని పక్క రాష్ట్రం నుంచి పారిపోయి వచ్చారని కన్నా ఎద్దేవా చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును కేవలం దోచుకోవడం కోసమే నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు ఆయనకు బంగారు బాతులా మారిందని అన్నారు.
చంద్రబాబు బతుకంతా ఇతరులను తిట్టడానికి సరిపోయిందని వట్టి గాలి మాటలు తప్ప ఆయన సాధించింది ఏమీ లేదని విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అగ్రిగోల్డ్, భూకుంభకోణం, జన్మభూమి కమిటీ వంటి అనేక కుంభకోణాలు వెలుగు చుశాయని కన్నా గుర్తు చేశారు.
రాఫెల్ విషయంలో కేంద్రంపై విమర్శలు చేసినవారంతా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్లతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు జరిపారని ఆరోపించారు.
రాహుల్ గాంధీని ప్రజలు క్షమించరని అన్నారు. జనవరి 6న నరేంద్ర మోదీ ఏపీ పర్యటకు వస్తున్నారని తెలిపారు. గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సభ వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కల్ని బయటపెడుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.